హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..

హైదరాబాద్‌లోని మియాపూర్ ఆదిత్యనగర్‌లో తల్లీకూతుర్లపై సందీప్ అనే వ్యక్తి నిన్న జరిగిన దాడి కారణంగా యువతి తల్లి మృతి చెందారు. నిన్న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన శోభ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.

గుంటూరు నుంచి వచ్చి మియాపూర్‌లో ఉంటున్న వైభవి, ఆమె తల్లిపై సందీప్ అనే వ్యక్తి మంగళవారం అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం సందీస్ అక్కడనుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న శోభ కొడుకు, స్థానికులు తల్లీకూతుర్లను స్థానికంగా ఉన్న కొండాపూర్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే యువతి తల్లి శోభకు తీవ్రగాయాలవడంతో చికిత్స పొందుతూనే ఆమె బుధవారం కన్నుమూశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు శోభ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వెంకటరాజు ఇంటికి సమీపంలోనే సందీప్ అనే యువకుడి కుటుంబం నివాసం ఉంటుంది.

ఈ క్రమంలోనే వెంకటరాజు కూతురు వైభవి, సందీప్ మధ్య కొంత కాలం పాటు ప్రేమాయణం సాగింది. దీంతో వీరిద్దరికి నిశ్చితార్ధం కూడా చేశారు పెద్దలు. అయితే సందీప్ వైఖరి నచ్చక తర్వాత ఆ నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకుంది వైభవి. ఇటీవలే మరొక యువకుడితో వైభవికి నిశ్చితార్ధం కూడా జరిగింది. ఆ తర్వాత గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు వైభవి కుటుంబ సభ్యులు.వైభవి తండ్రి మాత్రం గుంటూరులోనే ఉంటున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి హైదరాబాద్ మియాపూర్ ఆదిత్యనగర్ లో నివాసం ఉంటుంది. అయితే వైభవికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని.. నిశ్చితార్ధానికి కూడా సిద్దమయ్యారని తెలిసి సందీప్‌ మరింత రెచ్చిపోయాడు. ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇవ్వడమే కాక మంగళవారం సరాసరి ఇంటికొచ్చి అతి కిరాతంగా వైభవి, ఆమె తల్లి శోభపై కత్తితో దాడి చేశాడు.

మరో వైపు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సందీప్ పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెబుతున్నారు. కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో సందీప్‌నకు సర్జరీ చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జీ చేసిన తర్వాత సందీప్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సందీప్ దాడిలో గాయపడిన యువతి ఆసుపత్రిలో కోలుకుంటుందని వైద్యులు చెబుతున్నారు.తననే పెళ్లి చేసుకోవాలని సందీప్ యువతిని కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.మరోక యువకుడితో నిశ్చితార్ధం జరగడంతో సందీప్ కక్షగట్టి యువతిపై దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Please follow and like us:
క్రైమ్ వార్తలు