ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు

మూడు రోజులపాటు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ ఆదేశం

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకలు’ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్‌ 1 నుంచి మూడు రోజులపాటు బీఆర్‌ఎస్‌ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరపాలని ఆదేశించారు. 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించి, స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దశాబ్దకాలంపాటు తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వానిదేనని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సూచనలను అనుసరించి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్‌ పార్టీ కార్యకర్తలను, నేతలను కోరారు.

జూన్‌ 1న సాయంత్రం 7 గంటలకు గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అమర జ్యోతి వరకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనలో ప్రాణాలఅరి్పంచిన అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పిస్తారు. జూన్‌ 2 తెలంగాణ ఆవిర్భావ రోజున హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన సభ నిర్వహిస్తారు.

ఇదే రోజు హైదరాబాద్‌లోని పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. జూన్‌ 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో ముగింపు వేడుకలు నిర్వహిస్తా రు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగురవేస్తారు. జిల్లా ల్లోని దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు