Hussainsagar: దేశంలోనే తొలిసారి.. హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో

Hussainsagar: దేశంలోనే తొలిసారి.. హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో.. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ‘కోహినూర్’ వజ్రం గురించిన కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ.. భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసి ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్ పై రంగుల రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు. ఈ కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో.. ప్రముఖ రచయిత SS కంచి రాశారు. ప్రముఖ నేపథ్య గాయని (ప్లే బ్యాక్ సింగర్) శ్రీమతి సునీత గాత్రాన్ని అందించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ.. సౌండ్ అండ్ లైట్ షోస్ ఉన్నాయి. కానీ.. ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి.

కోహినూర్ కథతోపాటుగా.. తెలంగాణ కథ, ఇక్కడి సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ఈ షో పర్యాటకులను అమితంగా ఆకట్టుకోనుంది. దీంతోపాటుగా ఈ లేజర్ షోకు వచ్చే పర్యాటకులకు సరైన సైనేజెస్ (సూచికలు), 800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లున్నాయి. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన గ్యాలరీని ఏర్పాటుచేశారు. దీన్ని కూడా కేంద్రమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.

ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు:

రొబోటిక్ నాజిల్స్ అండ్ లైటింగ్: వెయ్యికి పైగా రొబోటిక్ నాజిల్స్, DMX ప్రొటోకాల్ తో కూడిన అడ్వాన్స్‌డ్ అండర్ వాటర్ లైటింగ్ సిస్టమ్స్ ద్వారా అద్భుతమైన రంగు రంగుల లైట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

గ్యాలరీ, రూఫ్ టాప్ రెస్టారెంట్: 800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ గ్యాలరీ, సంజీవయ్య పార్క్, మల్టీ మీడియా షోను పనోరమిక్ వ్యూ కోసం రూఫ్ టాప్ రెస్టారెంట్ ఏర్పాటుచేశారు.

HD ప్రొజెక్షన్:
ఒక్కొక్కటి 34వేల ల్యుమెన్స్ సామర్థ్యం గల 3 HD ప్రొజెక్టర్స్ ద్వారా.. వాటర్ స్క్రీన్ పై స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రొజెక్షన్ ఉండేలా ఏర్పాట్లున్నాయి. బీమ్ మూవింగ్ హెడ్‌లైట్స్ ద్వారా.. విజువల్ ఎఫెక్ట్ అందంగా ఉండనుంది.

కథాపరమైన వర్ణణ: కోహినూర్ వజ్రానికి సంబంధించన కథ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దేశ స్వాతంత్ర్య సంగ్రామం వంటి ఘట్టాలను సాగర్ అలలపై అందమైన లైటింగ్ ప్రొజెక్షన్ ద్వారా.. పర్యాటకులను ఆకట్టుకునేలా వివరిస్తారు. దీనికితోడు 5.1 డాల్బీ స్టయిల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఆడియో ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా స్పష్టంగా ఉండబోతోంది.

రికార్డ్-బ్రేకింగ్ వాటర్ ఫౌంటేన్: 260 అడుగుల ఎత్తు, 540×130 డైమెన్షన్‌ తో దేశంలోనే.. అతిపెద్ద, అతి ఎత్తయిన వాటర్ ఫౌంటేన్.. ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నాయి.

చారిత్రక ప్రాధాన్యత: స్టోరీ టెల్లింగ్ (కథను వివరించే విషయంలో) విషయంలో, చారిత్రక ఘట్టాలకు సరైన ప్రాధాన్యత విషయంలో.. సాంకేతిక సృజనాత్మకత కు పెద్దపీట వేశారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు