తెరపైకి ప్రమాణాల పర్వం.. ఎన్నికలు ముగిసినా అక్కడ ఆరని జ్వాలలు..

తెరపైకి ప్రమాణాల పర్వం.. ఎన్నికలు ముగిసినా అక్కడ ఆరని జ్వాలలు..

ఏపీలో ఎన్నికలు ముగిసినా..రాజమండ్రిలో పాలిటిక్స్‌ హీట్‌ ఇంకా తగ్గలేదు. మాజీ ఎంపీ భరత్‌ ప్రచార రథం దగ్ధం ఇష్యూ వైసీపీ వర్సెస్‌ టీడీపీగా మారిపోయింది. మార్గాని ఎస్టేట్‌లో భరత్‌ ప్రచార రథం తగులబడిపోవడంతో ఇరు పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. సింపతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగులబెట్టుకున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపిస్తే, దీనివెనుక భారీ కుట్ర ఉందని, మార్కండేయ గుడిలో సత్య ప్రమాణానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు మార్గాని భరత్‌. రాజమండ్రిలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. వాళ్ల ప్రచార రథాలు వాళ్లే తగలబెట్టుకుని టీడీపీపై నిందలేస్తున్నారన్నారు. ఈ ఘటనపై శనివారం క్లారిటీ ఇస్తానన్నారు స్థానిక ఎమ్మెల్యే.

ఇదిలా ఉంటే.. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు మార్గాని భరత్‌ సవాల్ విసిరారు. తమ పార్టీవాళ్లు ఎలాంటి తప్పు చేయకుంటే రాజమండ్రి మార్కండేయ గుడిలో ప్రమాణానికి సిద్దమా అని సవాల్ విసిరారు. వాహనాలు తగలబెట్టుకునే నీచ సంస్కృతి తనది కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు.. తనకు సింపతి ఎందుకు? అని ప్రశ్నించారు. వాహనాల దగ్ధంలో ఏదో కుట్ర దాగి ఉందని మార్గాని భరత్‌ అన్నారు. మొత్తానికి రాజమండ్రిలో వైసీపీ వర్సెస్‌ టీడీపీగా మారిపోయింది. మాజీ ఎంపీ మార్గాని భరత్‌ సవాల్‌కి.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సై అంటారా? శనివారం మీడియా సమక్షంలో ఆయన ఏం చెప్పబోతున్నారు? భరత్‌ సవాల్‌ను స్వీకరించి రాజమండ్రి మార్కండేయ గుడికి వెళ్తారా? అన్నది వేచిచూడాలి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు