అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..

అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..

ఒకే కుటుంబం.. ముగ్గురూ అన్నదమ్ములు.. ఎంతో సంతోషంగా సరదాగా ఉండేవారు.. ఈ క్రమంలోనే.. ఊరికొచ్చిన వారు సరదాగా చేపల వేట కోసం వాగుకు వెళ్లారు.. చీరతో చేపలు పట్టడం ప్రారంభించారు.. ప్రమాదవశాత్తూ వాగులో పడి ముగ్గురూ గల్లంతయ్యారు.. విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, వారిని కట్టుకున్న వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేపల వేట కోసం వెళ్లి ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ రూరల్ పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్‌లోని నవీ ఆబాదీకి చెందిన నాగుల్‌వాడ్‌ రాజు, మీనా బతుకుదెరువు కోసం తాంసి మండలం బండల్‌ నాగపూర్‌ గ్రామానికి వారం క్రితం వలసవచ్చారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు విజయ్‌ (28), ఆకాష్‌ (26), అక్షయ్‌ (22) ఉన్నారు.. వీరందరికీ పెళ్లైంది.. హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. విజయ్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తుండగా.. మిగిలిన ఇద్దరూ కూలి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

అయితే.. శ్రీకృష్ణాష్టమి పండగ నేపథ్యంలో బండల్‌ నాగపూర్‌లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే.. మంగళవారం మధ్యాహ్నం సరదాగా పొచ్చర వాగులో చేపలు పట్టడానికి బయలుదేరారు.. తమ బంధువైన కాంబ్లే శ్రీనివాస్‌తో కలిసి వాగు దగ్గరకు వెళ్లారు. అయితే.. చీరతో చేపలు పడుతుండగా.. అకస్మాత్తుగా ముగ్గురూ వాగులో పడి పోయారు. విజయ్‌, ఆకాష్‌, అక్షయ్‌ వరదలో గల్లంతయ్యారు.. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు..

మొదట విజయ్‌ మృతదేహం లభించగా.. ఆ తర్వాత అక్షయ్, అకాశ్‌ల మృతదేహాలు లభించాయి. వీరిలో విజయ్, అక్షయ్‌లకు రెండేళ్ల క్రితం వివాహం కాగా.. ఆకాశ్‌కు నాలుగు నెలల కిందట వివాహమైందని పోలీసులు తెలిపారు. అయితే.. ముగ్గురు కుమారులూ ఒకేసారి మృతిచెందడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు