ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్

ఏపీకి పిడుగులాంటి వార్త.. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలెర్ట్

తెలుగు రాష్ట్రాల గండం గట్టెక్కలేదా..? ప్రజలకు మళ్లీ వాన, వరద కష్టాలు తప్పవా?. ఏ ఏ జిల్లాలపై వరుణుడి ప్రతాపం ఉండబోతోంది.. వాతావరణశాఖ ఏం చెబుతుంది?.

తెలుగు రాష్ట్రాలను వాన కష్టాలు వీడేలా లేవు. వాన, వరద కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో.. రెండు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ అధికారులు. ముఖ్యంగా.. వరదలతో అల్లాడుతున్న ఎన్టీఆర్ జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇప్పటికే నాలుగైదు రోజులుగా వరద-బురదతో నరకం చూస్తున్న ప్రజలకు పిడుగులాంటి వార్తే ఇది. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు.. వరదల నుంచి బయటపడక ముందే.. మళ్లీ భారీ వర్షాలు వస్తే.. జన జీవనం మరింత నరకప్రాయం అయ్యే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అల్పపీడనం తోడైతే.. మరోసారి భారీ వర్షాలు తప్పవని చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంటున్నారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌తో పాటు.. మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఈ వరదంతా.. పోలవరం, ధవళేశ్వరం మీదుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. గోదావరి వరదతో.. పోలవరం ముంపు మండలాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు