శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం రైట్ పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ హౌస్ లో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపం తలెత్తడంతో 7వ నంబర్ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.

7వ నంబర్ జనరేటర్ లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ను మరమ్మత్తు పనులు‌ చేస్తున్నారు అధికారులు. ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గింది. జలాశయానికి వరద తగ్గుముఖం పట్టడంతో డ్యాం 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 99 వేల 615 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో లక్షా 81 వేల 235 క్యూసెక్కులు గా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కంటిన్యూ అవుతోంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు