ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. దసరా నాటికి క‌మిటీల ఏర్పాటు..!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. దసరా నాటికి క‌మిటీల ఏర్పాటు..!

ఇళ్లు లేనివారికి రేవంత్ రెడ్డి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. లబ్దిదారుల ఎంపికకు ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఎంపికైన లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు.

ఇందిర‌మ్మ క‌మిటీలను గ్రామ‌, వార్డు, మండ‌ల, ప‌ట్టణ‌, నియోజ‌క‌వ‌ర్గ, జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఒక‌టి రెండు రోజుల్లో రూపొందించాల‌ని అధికారులను ఆదేశించారు. అర్హుల‌ైనవారికి మాత్రమే ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని ముఖ్యమంత్రి అన్నారు. ఇక ప్రధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు ల‌క్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే, ఈ విష‌యంలో తెలంగాణ వెనుక‌బ‌డి ఉంద‌న్నారు సీఎం. ఈ ద‌ఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గ‌రిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

పీఎంఏవై కింద రాష్ట్రానికి రావ‌ల్సిన బ‌కాయిలు రాబ‌ట్టాల‌ని సీఎం అధికారులను దిశానిర్ధేశం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన స‌మాచారం వెంట‌నే ఇవ్వాల‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల విష‌యంలో డాటాను ఎప్పటిక‌ప్పుడు అన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాల‌ని సీఎం ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే,ఇంజినీరింగ్ సిబ్బంది స‌మ‌స్య ఎదుర‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అవ‌స‌ర‌మైతే ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధతిన నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి అదేశించారు.

రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఏళ్ల త‌ర‌బ‌డి వృథాగా ఉంచ‌డం స‌రికాద‌న్నారు. వెంట‌నే వేలానికి రంగం సిద్ధం చేయాల‌న్నారు. డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పూర్తయినా, వాటిని ఎందుకు అప్పగించ‌లేద‌ని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. అర్హుల‌కు ఆ ఇళ్లను అప్పగించాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, వాటికి అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్పగించాల‌ని సీఎం రేవంత్ అధికారుల‌కు సూచించారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు