నేడు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ.. ఎవరి డిమాండ్లు ఏంటంటే..?

నేడు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ.. ఎవరి డిమాండ్లు ఏంటంటే..?

నేడు ఏపీ- తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం..

హైదరాబాద్ వేదికగా రాష్ట్ర విభజన అంశాలపై భేటీ..

తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు.. ప్రధాన కార్యదర్శలు హాజరు..

ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌ లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు, జలవనరుల పంపిణీ కార్యదర్శులతో పాటు ఉద్యోగుల విభజన అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కాగా, ప్రధానంగా షెడ్యూలు-9, 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే ఛాన్స్ ఉంది. షెడ్యూలు-9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా భిడే కమిటీని నియమించింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ ఏం లేవు.. కానీ, మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరురాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు.. అలాగే, 10 షెడ్యూలులోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్‌ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదం కొనసాగుతుంది. విద్యుత్త్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఏపీ సర్కార్ దాదాపు రూ.24 వేల కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉండగా.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెప్పుకొస్తుంది.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై రేవంత్‌ ప్రత్యేక నజర్ పెట్టారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

అయితే, గత మార్చిలో ముఖ్యమంత్రి చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం సద్దమణిగింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 భేటీలు జరిగాయి. తాజాగా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విభజన అంశాలపై చర్చిద్దామంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్‌.. జ్యోతిరావు ఫులే ప్రజాభవన్‌లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

తెలంగాణ లేవనెత్తే అంశాలు ఇవే..!

  1. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి.
  2. ఆంధ్రప్రదేశ్‌కు 1000 కిలో మీటర్ల మేర విస్తారమైన తీరప్రాంతం(కోస్టల్‌ కారిడార్‌) ఉంది.. తెలంగాణకు ఈ తీరప్రాంతంలో భాగం కావాలి..
  3. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి.. తెలంగాణకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో భాగం ఇవ్వాలని డిమాండ్.
  4. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది.. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్‌మెంట్‌ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలి.. అదే విధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలి.
  5. తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు, ఏపీ విద్యుత్‌ సంస్థలు రూ.24 వేల కోట్ల బకాయిలను సత్వరమే చెల్లించాలి.. ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సినవి ఉంటే.. వాటిని తొందరలోనే చెల్లిస్తాం..
  6. తెలంగాణకు ఓడరేవులు లేవు.. కాబట్టి విభజనలో భాగంగా ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి..
Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు