నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్‌

నెత్తురు మరిగిన చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు.. 3 రోజుల్లో 3 డెడ్లీ యాక్సిడెంట్స్‌

చిత్తూరు జిల్లా ఘాట్‌ రోడ్లు నెత్తురు మరిగాయి. మూడు రోజుల్లో మూడు డెడ్లీ యాక్సిడెంట్స్‌ టెర్రర్ సృష్టించాయి. మూడు ప్రమాదాల్లో 12మంది మృతి చెందారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి…

ఘాట్‌ రోడ్లు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతికి దారితీస్తున్న ఘాట్లలో ప్రమాదం పొంచి ఉంది. భారీ ట్రాఫిక్‌ వల్ల.. అతివేగం కూడా తోడవడంతో ఈ ప్రమాదాలు జరుగుతుండడం వల్ల.. ప్రతీ నెలా పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు వదులుతున్నారు.

చిత్తూరు జిల్లాలో మూడు రోజుల్లో మూడు ప్రమాదాలు అది కూడా ఘాట్‌రోడ్లలోనే జరగడం భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈనెల 12న టమాటా లోడుతో వస్తున్న కంటైనర్‌ లారీ.. ఘాట్‌ రోడ్డు మలుపులో అదుపుతప్పి ఇన్నోవా కారుపై ఒరిగి పడింది. దీంతో ఇన్నోవా కారు అణిగిపోయి అందులో ఉన్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భాకరాపేట ఘాట్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పీలేరు మీదుగా తిరుపతికి వస్తూ మార్గమధ్యంలో భాకరాపేట ఘాట్‌ రోడ్డు మొదటి మలుపులో అదుపు తప్పి పక్కనే ఎదురు వెళుతున్న ఇన్నోవా కారుపై ఒరిగిపోయింది. తిరుమల వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురయ్యారు.

ఈనెల 13 అంటే.. శుక్రవారం.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ వద్ద బస్సు, లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును.. ఐరన్‌ లోడ్‌తో వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో అతివేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్ దాటి పక్క రోడ్డులో వస్తున్న బస్సును ఢీకొట్టింది. అనంతరం రెండు వాహనాలు మరో లారీ మీదకు దూసుకెళ్ళాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటుగా ఏడుగురు చనిపోయారు. లారీలోని ఇనుప చువ్వల కింద ఇరుక్కుని కొంతమంది చనిపోయారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. చికిత్స కోసం వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో బాధితుల ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణం వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.

ఇక శనివారం మరో ప్రమాదం అదే ఘాట్‌రోడ్డులో జరిగింది. శుక్రవారం ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి దగ్గర్లో కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి వెళ్లొస్తున్న ఓ కుటుంబం ఈ ప్రమాదానికి బలైంది. బంగారుపాళ్యం మండలం గాజులపల్లి మొగలి ఘాట్‌కు దగ్గర్లో కారు టైరు ఒక్కసారిగా పేలడంతో డివైడర్‌కు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఓ చిన్నారి ఉంది. తిరుమలకు వచ్చి బెంగళూరుకు తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు