మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’.. ప్రశంసలు కురిపిస్తోన్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’.. ప్రశంసలు కురిపిస్తోన్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

నందమూరి బాలకృష్ణ.. పైకి కొంచెం కఠినంగా కనిపించినా ఈయన మనసు వెన్న లాంటిది. ఒకటి, రెండు సందర్భాల్లో అభిమానులపై చేయి చేసుకుని విమర్శల పాలైనా, పలు సందర్భాల్లో తన గొప్ప మనసును చాటుకున్నారాయన. అలా తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు బాలయ్య. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారిగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నందమూరి హీరో. బాలయ్య హ్యాట్రిక్ సాధించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే, ఎమ్మెల్యేగా హిందూ పురం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నారాయన. అలా తాజాగా తన నియోజకవర్గంలో పర్యటించారు బాలయ్య . పార్టీ కార్యకర్తలు, అభిమానులతో నియోజకవర్గం అభివృద్ధి పనులపై చర్చించారు. అలా తాజాగా స్థానిక ప్రజలతో కలిసి భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలి భుజంపై ఆప్యాయంగా చేయి వేసి పలకరించారు బాలయ్య. ఆమె యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది.

సాధారణంగా సెలబ్రిటీ అయినా, ఎమ్మెల్యే అయినా సాధారణ జనాలను కలవడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య మాత్రం ఎలాంటి గర్వం ప్రదర్శించకుండా, చిన్న పిల్లాడి మాదిరిగా తన పక్కన వారితో జోకులేస్తూ భోజనం చేశారు.దీనిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ‘మా బాలయ్య బాబు గోల్డ్ ఎహే’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ ఫొటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. NBK 109 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు బోయ పాటి శీను డైరెక్షన్ లోనూ మరోసారి బాలయ్య నటించనున్నారని టాక్.

Please follow and like us:
వార్తలు సినిమా