తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో 18,829 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు..

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలైన సంగతి తెలిసిందే. జేఎన్‌టీయూహెచ్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించిన పరీక్షలకు 22,712 మంది దరఖాస్తు చేసుకోగా, 20,626 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

తెలంగాణ పీజీఈసెట్‌ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్ష జరిగింది. మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగాయి. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ప్లానింగ్‌తో సహా 19 బ్రాంచ్‌లలో పరీక్షను నిర్వహించారు. వీరిలో 18,829 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అంటే మొత్తం అభ్యర్ధుల్లో 91.28 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. 9,156 మంది అబ్బాయిలు అర్హత శాతం 90.06 నమోదైంది. అలాగే పరీక్షకు హాజరైన 11,470 మంది అమ్మాయిల్లో 92.27 శాతం మంది అర్హత సాధించారు. పరీక్షలు జరిగిన కేవలం నాలుగు రోజుల్లోనే పీజీఈసెట్‌ ఫలితాలను జేఎన్‌టీయూహెచ్‌ విడుదల చేయడం విశేషం.

పీజీఈసెట్‌ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మడీ, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్‌ పరీక్షలో మొత్తం మార్కుల్లో కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్ధులకు కనీస అర్హత మార్కులు ఉండవు. ఎన్ని మార్కులు వచ్చినా ర్యాంకు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి త్వరలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలకానుంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు